ఏపీ రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 

వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ప్రోత్సహించడానికీ, గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడానికీ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (Mahatma Gandhi NREGA), ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ నిర్వహణలో గ్రామీణ ప్రాంతాల్లోని పశువుల పెంపకందారులను మరింత ప్రోత్సహించబోతున్నట్లు మంత్రి తెలిపారు.

పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ల షెల్టర్ల నిర్మాణంపై రాయితీ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పశు పోషకులకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా.. పశువుల షెడ్లకు 90% రాయితీపై రుణాలు ఇస్తామని మంత్రి చెప్పారు. 

గరిష్టంగా యూనిట్ 2,30,000 వరకు సబ్సీడీ ఉంటుందని తెలిపారు. ఇది పశు పోషకులకు భారీ శుభవార్త అనుకోవచ్చు.

మేకలు, గొర్రెల పెంపకం, షెడ్లకు 70% రాయితీపై గరిష్ఠంగా యూనిట్ 2,30,000 వరకు సబ్సీడీ ఇస్తామని మంత్రి వివరించారు. 

కోళ్ల ఫారాలకు 70% రాయితీపై గరిష్ఠంగా యూనిట్ 1,32,000 వరకు రాయితీ ఇస్తామని చెప్పారు. 

త్వరలోనే అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 

ఇది మంచి నిర్ణయమే. దీని ద్వారా పశు పోషకులుగా మారిన రైతులకు మేలు జరుగుతుంది. 

వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా వారు పశువులు, కోళ్ల పెంపకం వైపు దృష్టి సారించే అవకాశం ఉంది.